నకిలీ బ్లీచింగ్పై సీబీఐ విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2020-08-09T12:32:36+05:30 IST
నకిలీ బ్లీచింగ్ పంపిణీ చేసిన వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని..
మాజీ ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల(గుంటూరు): నకిలీ బ్లీచింగ్ పంపిణీ చేసిన వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిడుగురాళ్లలో బ్లీచింగ్ తయారు చేసే పరిశ్రమలు ఏవీ లేనప్పుడు ఇక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు బ్లీచింగ్ ఎలా సరఫరా చేశారని ప్రశ్నించారు. బ్లీచింగ్ తయారుచేసిన పరిశ్రమలో రాత్రికి రాత్రే పరిశ్రమ ఎందుకు తగలబెట్టారో దర్యాప్తు తేలాల్సి ఉందన్నారు. డీపీవోను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొందేకానీ ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు ఎవరున్నారో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు పక్క రాష్ట్రాలకు వెళ్లి కరోనా చికిత్స పొందుతున్నారంటే మన రాష్ట్రంలో ఆసుపత్రుల పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం, దాతలిచ్చిన, రాష్ట్రప్రభుత్వం ఎంత మేరకు నిధులు కేటాయించి ఖర్చుచేసిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన వైద్యబృందం రాష్ట్రంలో పర్యటించాలన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.10లక్షలు, కరోనా సోకిన ప్రతి వ్యక్తికి రూ.లక్ష ఏడాది పాటు నిత్యావసర సరుకులు, మందులను ఆ కుటుంబానికి ఉచితంగా ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరారు.