మంత్రిపై బీకే మండిపాటు
ABN , First Publish Date - 2020-05-23T10:40:43+05:30 IST
మంత్రి పదవికి బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అనర్హుడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు
టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని తను చేశానని చెప్పుకోవటం సిగ్గుచేటు.. మంత్రి పదవికి అనర్హుడంటూ ధ్వజం..
పెనుకొండ టౌన్, మే 22: మంత్రి పదవికి బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అనర్హుడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి విమర్శించారు. శుక్రవారం మడకశిరకు వెళ్లే రహదారిలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీకే పార్థసారధి మాట్లాడుతూ పలు కార్యక్రమాల్లో మంత్రి, ఆయన అనుచరులు అసమర్థనాయకుడు పార్థసారథి అని మాట్లాడటమేకాకుండా ఓ పత్రిక, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే తాను ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేశానని వాటిని తాను చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
2007లో గొల్లపల్లి రిజర్వాయర్ను ప్రారంభించి, 2శాతం పనులు కూడా అప్పటి ప్రభుత్వం పూర్తి చేయలేదని, టీడీపీ అధికారంలోకి రాగానే రిజర్వాయర్ పనులు పూర్తిచేసి నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించానన్నారు. ‘రాప్తాడు ఎమ్మెల్యే కొత్త జీఓతో పెనుకొండ నియోజకవర్గం మీదుగా విడిగా నీరు తీసుకెళ్తుంటే రొద్దం మండలానికి నీరు వస్తుంది. అంతే తప్పా నీవు చేసిందేమిలేదు.. మంత్రిగా నీకు సిగ్గు అనిపించటం లేదా’ అని మండిపడ్డారు. ఏదైనా ఆధారాలతో మాట్లాడాలని హితవుపలికారు. అన్ని చెరువులకు నీరు అందించి, సత్తా ఉన్న మంత్రిగా నిరూపించుకోవాలని శంకరనారాయణకు సవాల్ విసిరారు.