టీడీపీ మాజీ మంత్రి నడకుదిటి కన్నుమూత
ABN , First Publish Date - 2021-04-02T06:56:30+05:30 IST
మాజీ మంత్రి..
మచిలీపట్నం: మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారన్న వార్త బందరు ప్రజల హృదయాలను కలచి వేసింది. ఒకనాడు నావలు, పడవల తయారీలో నిష్ణాతుడైన నరసింహారావు, తరువాత నవీన ఇండస్ర్టీస్ ద్వారా రైస్మిల్లులకు అవసరమైన విడి భాగాలను తయారు చేసేవారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ వెంట నడిచారు. 1996 నుంచి 99 వరకు మచిలీపట్నం అర్బన్ బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం సాధించారు. మత్స్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో బందరుకోటలో మత్స్యకారులకు శిక్షణశాలలు ఏర్పాటు చేశారు. నడకుదిటి భౌతిక కాయాన్ని బందరులోని నివాసం వద్ద ఉంచుతారని, శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు.