రేషన్ పంపిణీ వేగవంతం కోసం...
ABN , First Publish Date - 2021-02-25T04:48:13+05:30 IST
ఇంటింటికీ రేషన్ పంపిణీ లక్ష్యం త్వరగా పూర్తి చేస్తున్నట్లు చూపించేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు గత నాలుగు రోజులుగా కొత్త ఎత్తుగడ వేశారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 24: మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికీ రేషన్ పంపిణీ ఈ నెల 20వ తేదీలోగా ముగించాల్సి ఉంది. అయితే నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. తాజా సమాచారం మేరకు రేషన్ డీలర్ల వద్ద ఇంకా 48శాతం ఫిబ్రవరి కోటా సరుకుల నిల్వ ఉంది. పంపిణీ లక్ష్యం త్వరగా పూర్తి చేస్తున్నట్లు చూపించేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు గత నాలుగు రోజులుగా కొత్త ఎత్తుగడ వేశారు. వీఆర్వోలకు రేషన్ పంపిణీ లాగిన్ ఇచ్చి, దాని ద్వారా చౌకదుకాణాల్లోని ఈ పాస్లలో అథెంటికేషన్ చేయించి షాపుల ద్వారా సరుకులు పంపిణీ లోపాయికారీగా చేయిస్తున్నారు. కాగా బుధవారం నాటికి 630042 కార్డులకు సరుకుల పంపిణీ జరిగింది. పోర్టబులిటీ ద్వారా 12214కార్డులకు, ఆఫ్లైన్ ద్వారా 18076 కార్డులకు నిత్యావసర సరుకులు అందించారు.