ఇంటింటా తిరంగా..

ABN , First Publish Date - 2022-08-10T06:04:40+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.

ఇంటింటా తిరంగా..
ఐమాక్స్‌ వద్ద మువ్వన్నెల బెలూన్లను ఎగురవేస్తున్న మంత్రి తలసాని

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15 రోజులపాటు పలు కార్యక్రమలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాలు పంపిణీ చేసింది. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పౌరులకు త్రివర్ణ పతకాలు అందజేశారు. అనంతరం మల్టీప్లెక్స్‌ల్లో విద్యార్థులతో కలిసి వారు వేర్వేరుగా గాంధీ చిత్రాన్ని తిలకించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి బంజారాహిల్స్‌లో జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. 20 లక్షల కుటుంబాలకు ఇచ్చేందుకు వీలుగా 20 లక్షల జాతీయ పతాకాలు అందుబాటులో ఉంచారు. ఇంటింటికీ వజ్రోత్సవ స్టిక్కర్లు అందజేస్తున్నారు. 25 లక్షల స్టిక్కర్లు ముద్రించారు. 11న 2కే రన్‌, వాక్‌లు నిర్వహించనున్నారు. 12న త్రివర్ణ పతాకాల రాఖీలు ధరించి జాతీయ సమైక్యత ప్రదర్శించాలన్నారు. 13న ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు, అధికారులు ఫ్లకార్డులు, జాతీయ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తారు. 14న జానపద కళాకారుల ప్రదర్శన ఉంటుంది. 22 వరకు రోజుకో కార్యక్రమం జరుగుతుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. 

గ్రేటర్‌లో ఫ్రీడమ్‌ పార్కులు

నేడు మొక్కలు నాటనున్న ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఫ్రీడమ్‌ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంస్థ.. ఆ పార్కుల్లో ప్లాంటేషన్‌ చేపడుతోంది. నగరంలో నూతనంగా అభివృద్ధి చేస్తోన్న 75 పార్కుల్లో 10,350 మొక్కలను ప్రజాప్రతినిధులు నేడు నాటనున్నారు. ఒక్కో పార్కులో అందుబాటులో ఉన్న విస్తీర్ణాన్ని బట్టి 75, 750, 7500 మొక్కలు నాటాలని అధికారులు నిర్ధేశించారు. 

Updated Date - 2022-08-10T06:04:40+05:30 IST