ఒడిశాలోని ఒకప్పటి మావోయిస్టు కేంద్రంలో 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు
ABN , First Publish Date - 2022-02-25T00:00:41+05:30 IST
ఒడిశాలో ఒకప్పుడు మావోయిస్టు కేంద్రంగా పరిగణించిన మల్కన్గిరి జిల్లాలోని స్వాభిమాన్ అంచల్లో 15 ఏళ్ల
భువనేశ్వర్: ఒడిశాలో ఒకప్పుడు మావోయిస్టు కేంద్రంగా పరిగణించిన మల్కన్గిరి జిల్లాలోని స్వాభిమాన్ అంచల్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగాయి. పంచాతీయ ఎన్నకల చివరి విడతలో భాగంగా నేడు ఇక్కడ ఎన్నికలు జరుతున్నాయి. చివరిసారి 2007లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అయితే, మావోయిస్టు ప్రాబల్యం కారణంగా 2012, 2017లో ఎన్నికలను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్లో పనిచేసే మావోయిలు ఈ ప్రాంతాన్ని అప్పట్లో షెల్టర్గా ఉపయోగించుకునేవారు.
ఈ ప్రాంతం మూడు వైపులా నీరు ఉండగా ఒక వైపు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అడవికి దారితీస్తుంది. ఈ ప్రాంతంలోని జోడంబ, పనాస్పట్, అండరాపలి, జంత్రి తదితర ప్రాంతాలకు ఎన్నికల అధికారులు బోట్లపై కొన్ని గంటలపాటు ప్రయాణించి చేరుకున్నారు. పోలింగ్ పార్టీలను ఇప్పటికే అక్కడికి సురక్షితంగా తరలించామని, స్వాభిమాన్ అంచల్లో పోలింగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పోలీసులు చూసుకున్నారని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలముకుంద్ భూయన్ తెలిపారు.
స్వాభిమాన్ అంచల్లో ఇప్పుడు మావోల భయం లేదని, ల్యాండ్మైన్లు, కిడ్నాపుల భయం అసలే లేదని జిల్లా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చివరి దశలో 25 జిల్లాల్లో విస్తరించిన 48 బ్లాకుల్లోని 975 ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 41.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 52 శాతం ఓటింగ్ నమోదైంది.