తొలిసారి ఎమ్మెల్యే.. గుజరాత్కు సీఎం
ABN , First Publish Date - 2021-09-13T07:29:09+05:30 IST
గుజరాత్ నూతన ముఖ్యమంత్రి నియామకం విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన నేతలెవరినీ కాకుండా...
- భూపేంద్ర పటేల్కు పట్టం.. పటీదార్ వర్గానికి ప్రాధాన్యం
- ‘పటేల్’లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ వ్యూహం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గుజరాత్ నూతన ముఖ్యమంత్రి నియామకం విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగిన నేతలెవరినీ కాకుండా.. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్(59)ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం బీజేపీకి చెందిన 112 మంది ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ను ఎన్నుకున్నారు. బీజేపీ జాతీయ పరిశీలకులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ పేరును తాజా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రతిపాదించగా, ఇతర సభ్యులు మద్దతు పలికారు. అనంతరం భూపేంద్రపటేల్.. గవర్నర్ను కలిసి శాసనసభాపక్ష నేతగా తన ఎన్నికకు సంబంధించిన లేఖను సమర్పించారు. సోమవారం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్కు అనుయాయుడైన భూపేంద్ర.. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2015-2017 మధ్య అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేశారు. 2010-2015 మధ్య అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండిం గ్ కమిటీ చైర్మన్గానూ వ్వవహరించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా భూపేంద్ర పటేల్కు పేరుంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పటీదార్ వర్గాన్ని తమవైపు తిప్పుకొనేందుకే భూపేంద్ర పటేల్ను సీఎం కుర్చీపై బీజేపీ కూర్చోబెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ పట్ల పటీదార్లలో విముఖత..
రాష్ట్ర జనాభాలో 12శాతం దాకా ఉన్న పటేళ్లు తమకు బీసీ హోదా కల్పించాలంటూ 2015లో పెద్ద ఎత్తున పటీదార్ ఉద్యమం నిర్వహించారు. అప్పటి నుంచి బీజేపీకి పటేల్ వర్గం మద్దతు తగ్గుతూ వచ్చింది. అప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్కు ప్రాబల్యం కూడా తగ్గడంతో బీజేపీ పట్ల ఆ వర్గం విముఖంగా ఉంటోంది. ఈ కారణాల వల్లే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొటాబొటి సీట్లతో అధికారాన్ని దక్కించుకోగలిగింది. ఆ పార్టీకి 2012 ఎన్నికల్లో 60శాతం వచ్చిన ఓట్లు.. 2017లో 49శాతానికి పడిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ ఓట్లు 33 నుంచి 41.4 శాతానికి పెరిగింది. దీనికితోడు రాష్ట్రంలో 2శాతం మాత్రమే ఉన్న జైన్ వర్గానికి చెందిన విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా నియమించడంతో పటీదార్లలో వ్యతిరేకత మరిం త పెరిగింది. దీంతో ఆ వర్గాన్ని తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో గుజరాత్ నుంచి ఏడుగురికి అవకాశం కల్పించగా వారిలో పటేల్ వర్గానికి చెందిన మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలాకు కేబినెట్ హోదా కల్పించారు. తాజాగా భూపేంద్ర పటేల్ను సీఎంను చేసి పటేల్ వర్గాన్ని తృప్తి పరచ్చారు.