లాక్డౌన్ అతిక్రమిస్తే ఇంటికే ఎఫ్ఐఆర్
ABN , First Publish Date - 2020-04-05T02:30:16+05:30 IST
లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదని యూపీ పోలీసులు నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ...
లక్నో: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదని యూపీ పోలీసులు నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ఎవరు నిబంధనలను అతిక్రమించినా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కాపీని వారి ఇంటికే పంపుతున్నారు. ఈ మేరకు ముజఫరాబాద్ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఎవరైనా మొదటిసారి నిబంధనలను అతిక్రమిస్తారో వారిపై కేసు నమోదు చేస్తామని, రెండో సారి కూడా అదే తప్పు చేస్తే అరెస్టు చేస్తామని ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని ప్రతి వీధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఎవరూ బయటకు రావద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ముజఫరాబాద్ పోలీసులు తెలిపారు. రోడ్లపై ఖాళీగా తిరుగుతున్న వారిద్దరినీ సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించామని, వారి ఇంటి అడ్రస్సు ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీని పంపించామని చెప్పారు.