నిండుకుండలా జలాశయాలు
ABN , First Publish Date - 2022-09-27T06:42:29+05:30 IST
ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి.
జోలాపుట్టు, డుడుమకు జలకళ
ముంచంగిపుట్టు, సెప్టెంబరు 26: ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా జలాశయాల్లోకి వరదనీరు ఇన్ఫ్లో పెరిగింది. దీంతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జోలాపుట్టు జలాశయం నీటిని నిల్వ సామర్థ్యం 2750 అడుగులు కాగా, సోమవారం 2734.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 2727.30 అడుగులు నీరు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏడు అడుగులు నీరు ఎక్కువగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డుడుమ జలాశయంలో సైతం నీటి నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల జోలాపుట్టు నుంచి డుడుమకు నీటి సరఫరాను నిలిపివేశారు. డుడుమ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2790 అడుగులు కాగా, ప్రస్తుతం 2575.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం రెండు జలాశయాల్లో నీటి నిల్వలు నిలకడగానే ఉన్నాయని, దీంతో డుడుమ నుంచి విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలవిద్యుత్ కేంద్రంలో మూడు జనరేటర్ల సహాయంతో 54 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది.