విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
ABN , First Publish Date - 2021-02-25T07:02:25+05:30 IST
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాఽథ్
నగర కాంగ్రెస్ పార్టీ ఆధ ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం
ఒంగోలు(క్రైం), ఫిబ్రవరి 24 : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పోస్కోకు ధారాదత్తం చేయడానికి సిద్ధమయ్యాయన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రూ.2లక్షల కోట్ల విలువైన ఆస్తిని కారుచౌకగా కార్పొరేటు మాఫియాకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. దీని వలన 2లక్షల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొన్నదన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ దేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తే, బీజేపీ కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్నదని విమర్శించారు. ఏఐకేఎస్సీ జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడి, నియంతృత్వ ధోరణిలో పరిపాలన చేస్తున్నాయన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా చేసే పోరాటాలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీపీఐ నాయకులు యు.ప్రకాశరావు మాట్లాడుతూ ప్రజాఉద్యమాలకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఇంకా రైతు నాయకులు చుంచు శేషయ్య, హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య, నాయకులు తాటిపర్తి గోపాల్రెడ్డి, దాసరి సుందరం, కరవది సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి, నాయకులు షేక్ సైదా, జగదీష్, రాజశేఖర్, వల్లంరెడ్డి రాజగోపాలరెడ్డి, హజిమున్నీసా బేగం, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.