ఎరువు.. బరువు

ABN , First Publish Date - 2022-06-26T05:03:46+05:30 IST

నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు మామిడి, అరటి, బొప్పాయి, నిమ్మ, పసుపు పంటల సాగుపై ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి, ధరలు నిలకడ లేకపోవడంతో రైతులు నష్టపోయారు. పైగా దళారీ వ్యవస్థ వల్ల పె ట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో కుదేలవుతున్నారు.

ఎరువు.. బరువు
మన గ్రోమోర్‌లో విక్రయిస్తున్న ఎరువులు, క్రిమిసంహారక మందులు

భారీగా పెరిగిన ధరలు

ఆందోళనలో అన్నదాతలు

నియంత్రణలో ప్రభుత్వం విఫలం


ఈ ఏడాది వర్షాలు ఓ మోస్తరుగా కురవడంతో వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పెరిగింది. పంటలను సాగు చేద్దామని రైతులు సన్నద్ధమయ్యారు. కానీ ఇంతలోనే భారీగా పెరిగిన ఎరువుల ధరలు రైతులకు షాకిచ్చాయి. పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో.. రాదో అని ఆందోళన చెందే రైతులకు ఇవి మరింత భారమయ్యాయి. రైతులకు అన్ని విధాల పెద్దపీట వేస్తాం అన్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. 


రైల్వేకోడూరు(రూరల్‌), జూన్‌ 25: నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు మామిడి, అరటి, బొప్పాయి, నిమ్మ, పసుపు పంటల సాగుపై ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి, ధరలు నిలకడ లేకపోవడంతో రైతులు నష్టపోయారు. పైగా దళారీ వ్యవస్థ వల్ల పె ట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో కుదేలవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడా ది కురిసిన వర్షాలకు భూమిలో నీటిమట్టం పెరగడంతో వ్యవసాయ బోర్ల ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించు కుందామని రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. కానీ ఈ సారి ఎరువుల ధరల రూపంలో రైతన్నకు భారీ దెబ్బ పడ్డట్లయింది. దీంతో అన్నదాతలు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం రైతులకు వందశాతం సబ్సిడీతో ఎరువులు అందించడంతో పాటు పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


రైతుల సంక్షేమం ఎక్కడ ?

రైతుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో ప్రఽఽథమ స్థానం కల్పిస్తున్నాం అన్ని గొప్పగా చెప్పే నాయకులు ఆచరణలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న డ్రిప్‌కు వచ్చే సబ్సిడీని పూర్తిగా తీసివేశారు. దీంతో ఎకరాకు రూ.30 వేల నుంచి 40వేలు ఖర్చు వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వానికి ఎరువుల ధ రలను పెంచడంలో ఉన్న ఆసక్తి, మ ద్దతు ధరలను పెంచడానికి ముందు కు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల ధరలు తగ్గించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.


ధరలపై దృష్టి సారించాలి..

ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలపై దృష్టి సారించి ధరలను తగ్గించాలి. ప్రతి ఏటా ఎరువుల ధరలను 

ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. దీనికి తోడు క్రిమిసంహరక మందులు కూడా భారీగా పెరిగాయి. ఇలా పెంచడం వల్ల రైతులకు వ్యవసాయ ఖర్చు పెరిగి పెట్టిన పెట్టుబడి రాకా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. సకాలంలో కొన్ని ఎరువులు కూడా అందుబాటులో లేవు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలి.

- సుగవాసి ఈశ్వరయ్య, రైతు


సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పిస్తున్నాం..

ఎరువుల ధరలు పెరగడంతో సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులనే వాడాలి. దీని వల్ల ఖర్చు తగ్గి అధిక దిగుబడితో లాభాలు వస్తాయి. మండలంలోని ప్రతి పంచాయతీలో సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు సందేహాలుంటే రైతు భరోసా కేంద్రాల వద్ద వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

- సుధాకర్‌, ఏఓ రైల్వేకోడూరు


Updated Date - 2022-06-26T05:03:46+05:30 IST