వచ్చే నెల 23, 24 తేదీల్లో సమ్మె
ABN , First Publish Date - 2022-01-27T04:50:13+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
జయప్రదం చేయాలని ఉమామహేశ్వరరావు పిలుపు
పొదిలి (రూరల్) జనవరి 26 : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సమాన పనికి సమానవేతనం, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం రెగ్యూలరైజేషన్ సాధనకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎన్జీవో హోంలో బుధవారం జరిగిన సీఐటీయూ పశ్చిమ ప్రకాశం ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు యాజమాన్యాలకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల, ప్రభుత్వ ఆస్తులను అదాని, అంబానీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకునే బాధ్యతను విస్మరించారన్నారు. నష్టాలు వచ్చే ప్రభుత్వ ఆస్తులను అమ్ముతామని చెప్పిన పాలకులు ఆ తరువాత అన్నింటినీ అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. సమ్మె చేసే హక్కులకు ఆటంకం కలిగించి ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలకు ఇష్టారాజ్యంగా మార్చిందన్నారు. ఈపీఎఫ్, ఈఎ్సఐ పథకాలను కూడా ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా మార్చే అవకాశం ఇచ్చిందని విమర్శించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్మికులకు 1957, 1992 సుప్రింకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు ఉండాలన్నారు. ఫిబ్రవరిలో జరిగే దేశవ్యాప్త సమ్మెల్యే అందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షకార్యదర్శులు డీకేఎం రఫీ, ఎం రమేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ హానీఫ్, సీఐటీయూ జిల్లా నాయకులు టీ ఆవులయ్య, కేశవరావు, ఐవీ రాఘవయ్య, మాలకొండయ్య, అంజమ్మ, కోటేశ్వరరావు, సుబ్బరాయుడు, బాలమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.