భార్య శవంతోపాటు పదేళ్ల కొడుకుతో కలిసి అంబులెన్స్లో ఓ భర్త సొంతూరికి వెళ్తోంటే జరిగిన ఘోరమిది..
ABN , First Publish Date - 2021-08-04T16:03:39+05:30 IST
మహిళ చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబానికి మరో విషాదం ఎదురైంది.
మహిళ చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబానికి మరో విషాదం ఎదురైంది. భార్య శవాన్ని అంబులెన్స్లో పెట్టుకుని బయల్దేరిన భర్తకు, పదేళ్ల కొడుకుకు ఘోర ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పదేళ్ల కొడుకు చనిపోగా.. అతని తండ్రి గల్లంతయ్యాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయి.. మరొకరి గల్లంతు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజస్థాన్లోని జైపూర్-బారౌనీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సిరాస్ గ్రామానికి చెందిన రామ్జీ లాల్, తన కొడుకు రామ్నారాయణ్తో కలిసి జైపూర్లో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. రామ్జీ భార్య గీతా దేవి స్వగ్రామంలో ఉంటోంది. కొంతకాలంగా ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెను జైపూర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా సోమవారం రాత్రి ఆమె మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రామ్జీ ఓ అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. గీతా దేవి మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్ సిబ్బంది, రామ్జీ, అతని పదేళ్ల కొడుకు రామ్నారాయణ్ సోమవారం రాత్రి జైపూర్ నుంచి బయల్దేరారు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బౌరావి పోలీస్ స్టేషన్ సమీపంలోని వాగు దాటుతుండగా అంబులెన్స్ మునిగిపోయింది. దీంతో డ్రైవర్, అతడి సహచరులు అంబులెన్స్ కిటికీ నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. అంబులెన్స్ టాప్ మీద కూర్చుని అరవడంతో వారిని స్థానిక రైల్వే పోలీసులు కాపాడారు. అలాగే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన పదేళ్ల రామ్నారాయణ్ మృతదేహం కూడా లభ్యమైంది. అయితే రామ్జీ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. రామ్జీ కూడా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతడి మృతదేహం గురించి గాలింపు చేపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇంతటి ఘోరం సంభవించడంతో సిరాస్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.