పండుగ పూట కార్మికులకు పస్తులు
ABN , First Publish Date - 2021-01-16T05:04:50+05:30 IST
పండుగ పూట కార్మికులను పస్తులు ఉంచిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్ విమర్శించారు.
పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నాగజగదీశ్
అనకాపల్లి, జనవరి 15: పండుగ పూట కార్మికులను పస్తులు ఉంచిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్ విమర్శించారు. తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు నెలల తరబడి జీతాలు అందక అర్ధాకలితో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ తదితర అన్ని మతాల కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మాజీ సీఎం చంద్రబాబునాయుడు కానుకలు పంపిణీ చేసేవారని గుర్తు చేశారు. అర్హులందరికీ అమ్మఒడి వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు కొణతాల వెంకట్రావు, ధనాల విష్ణుచౌదరి పాల్గొన్నారు.