ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2021-10-26T04:19:56+05:30 IST
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
- కలెక్టర్ అమయ్కుమార్
(ఆంఽధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): యాసంగిలో పండించే వరిని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కొనుగోలు చేయనందున వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అమయ్కుమార్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచనల మేరకు మండల వ్యవసాయాధికారులు గ్రామాల్లో పంటలసాగుపై పక్కా ప్రణాళికలు తయారుచేయాలని ఆదేశించారు. యాసంగిలో వరికి బదులు శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, ఆముదాలు, ధనియాలు, కుసుమ తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలోని 83 రైతు వేదికల్లో క్లస్టర్ల వారీగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. క్లస్టర్ల వారీగా యాసంగి పంట ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. నవంబర్ చివరి వరకు వారంలో కనీసం రెండుసార్లు రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతిరావు, వ్యవసాయశాఖ అధికారి గీత, ఉద్యానశాఖ అధికారి సునంద, శాస్త్రవేత్త విజయ్శేఖర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మనోహర్రాథోడ్, మార్కెటింగ్శాఖ అధికారి శ్యామలాదేవీ, తదితరులు పాల్గొన్నారు.