‘వాటా’కు వాలిపోతున్నారు!

ABN , First Publish Date - 2020-05-29T11:41:55+05:30 IST

రంగంపేట మండలంలో అన్నదాతలకు జమయిన రూ.23 కోట్ల భూ పరిహారంపై రాజకీయ రాబందులు కన్నేశాయి.

‘వాటా’కు వాలిపోతున్నారు!

రంగంపేటలో రైతుల పరిహారంపై రాజకీయ రాబందులు

ఇళ్ల స్థలాలకు భూములు ఇచ్చిన అన్నదాతల ఖాతాల్లో రూ.23 కోట్లు 

తమ వల్లే అధిక ధర వచ్చిందంటూ వాలిపోయిన కొందరు వైసీపీ నేతలు 

ఎకరాకు రూ.4 లక్షల చొప్పున మామూళ్లు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు

తమ సంగతేంటంటూ వాటాల కోసం రెవెన్యూ అధికారుల వేట

మండలంలో చక్రం తిప్పుతున్న  ఓ నెంబర్‌ టూ మహిళా అధికారి

ఇటు వైపీసీపీ నేతలు, ఇటు రెవెన్యూ ఒత్తిళ్లతో అన్నదాతల గగ్గోలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రంగంపేట మండలంలో అన్నదాతలకు జమయిన రూ.23 కోట్ల భూ పరిహారంపై రాజకీయ రాబందులు కన్నేశాయి. తమ వాటా ఇచ్చి తీరాల్సిదేనంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎకరాకు రూ.4 లక్షల చొప్పున మామూళ్ల కోసం వేటాడుతున్నాయి. ఇవ్వకపోతే జమ యిన పరిహారం వెనక్కు లాగేసుకునేలా చేస్తామం టూ అధికార పార్టీకి చెందిన కొందరు మండలస్థాయి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇంకోపక్క తమ సంగతేం టంటూ మండల రెవెన్యూ అధికారులు కొందరు వాలి పోతున్నారు. తక్కువ ధర పలికే భూములకు ఎక్కువ పరిహారం తమ వలనే వచ్చిదంటూ ఎకరాకు రూ.లక్ష అయినా మామూళ్ల లెక్క తేల్చాలని పట్టుబడుతు న్నారు. అటు అధికారపార్టీ నేతలు, ఇటు అధికారుల తీరుతో ఏంచేయాలో తెలియక అన్నదాతలు తలపట్టు కుంటున్నారు.


పేదల ఇళ్ల స్థలాలకు మండలంలో సుమారుగా అయిదువేల మంది లబ్ధిదారులను  గుర్తించారు. ఇందుకోసం వంద ఎకరాల వరకు భూముల అవసరం ఉంటుందని అంచనా వేశారు. మండలంలో ప్రభుత్వ భూముల లభ్యత పెద్దగా లేకపోవడంతో ప్రైవేటుగా సేకరించాలని నిర్ణయించా రు. దీంతో రంగంపేట మండలంలో వడిశలేరు, పెదరాయవరం, ఈలకొలను, చండ్రేడు, సుభద్రంపేట, రంగంపేట, కోటపాడు, ఎస్‌.టి.రాజపురం, దొడ్డిగుంట, సింగంపల్లి, దొంతమూరు తదితర 14 గ్రామాల్లో 86 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. ఇందు లో వడిశలేరులో 8.26 ఎకరాలు, దొడ్డిగుంటలో 8.14 ఎకరాల చొప్పున ఆరు గ్రామాల్లో 26 ఎకరాల వరకు మిగులుభూములు కాగా మిగిలిన 60 ఎకరాలు ప్రైవే టు భూముల సేకరణకు కలెక్టర్‌ పేరుతో భూసే కరణ నోటిఫికేసన్‌ జారీచేశారు. ఇందులో కోటపాడు, పెదరాయవరం, చండ్రేడు, వడిశలేరు, రంగంపేట తదితర గ్రామాలు ఏడీబీ రోడ్డుకు సమీపంలో ఉండ డంతో ఎకరాకు రూ.33 లక్షల వరకు అన్నదాతలకు పరిహారం చెల్లించారు. వాస్తవానికి ఇక్కడ సబ్‌రిజి స్ట్రార్‌ కార్యాలయ విలువ ఎకరాకు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఉండగా మార్కెట్‌ ధర రూ.25 లక్షల వరకు పలుకుతోంది.


ఎస్‌.టి. రాజపురం గ్రామంలో ఎకరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ విలువ రూ.9.27 లక్షలు కాగా మార్కెట్‌ విలువ రూ.29 లక్షల వరకు ఉంది. కానీ భూసేకరణ నోటిఫికేషన్‌ ద్వారా ఎకరాకు ఈ గ్రామంలో రూ.39 లక్షల వరకు చెల్లిం చారు. అటు మిగులు భూములకు సంబంధించి వడిశలేరు, దొడ్డిగుంట తదితర ప్రాంతాల్లో ఎకరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ విలువ రూ.11.23 లక్షలు ఉండగా, ఇవి ప్రభుత్వ భూములు అయినప్ప టికీ లబ్ధిదారుల ఆధీనంలో ఉండడంతో వారికి కూడా రూ.33 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ఇలా మండలం మొత్తం 86 ఎకరాల భూసేకరణకు రూ.23 కోట్ల వరకు అన్న దాతల ఖాతాల్లో ఇటీవల పరిహారం జమ అయింది. 


వాటా ఎకరాకు రూ.4లక్షలు ఇవ్వాల్సిందే..

రూ.23 కోట్ల పరిహారంపై అనపర్తి నియోజకవర్గ కీలక నేత అనుచరులు మండలంలో మామూళ్ల వేట మొదలుపెట్టారు. రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు మించి ఎకరాకు పరిహారం రాదని, కాకపోతే తాము అధికారులపై ఒత్తిడి తేవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరిహారం పెంచారని అన్నదాతలను నమ్మిస్తూ బేరాలాడుతున్నారు. ఎకరాకు ఒక్కో రైతుకు మార్కెట్‌ ధర కంటే రూ.10 లక్షల వరకు లాభం వచ్చిందని, ఈ నేపథ్యంలో ఖర్చుల కోసం ఎకరాకు రూ.4 లక్షల వరకు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. మిగులు భూములకు పరిహారం పొందిన రైతుల వద్దకు వెళ్లి రూ.33 లక్షలు ఉచితంగా వచ్చినట్టని ఎకరాకు రూ.5 లక్షల వరకు ఇవ్వాలని పట్టుబడుతు న్నారు.


ఇలా మండలంలో గ్రామాల వారీగా పరిహారం పడ్డ రైతుల వద్దకు వెళ్లి డబ్బు తెచ్చి ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. దీంతో కొందరు అన్నదాతలు భయ పడి రూ.3 లక్షల చొప్పున మామూళ్లు ఇచ్చుకుం టున్నారు. కొందరైతే తమ వల్ల కాదని, అప్పులు తీర్చాల్సి ఉన్నందున అంత ఇచ్చుకోలేమంటూ ప్రాథేయపడుతున్నారు. దీంతో మండలంలో కీలక వైసీపీ నేతలు అలా అయితే పడ్డ పరిహారం తిరిగి వెనక్కు తీసుకుని భూసేకరణ రద్దు చేయిస్తా మంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా గత నెల్లో పరిహారం బ్యాంకు ఖాతాల్లో పడ్డప్పటి నుంచి ఇదే రీతిన ఒత్తిళ్లు తెస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విషయం నియోజకవర్గ కీలకనేతకు తెలిసినా అనుచరులను మాత్రం అదుపు చేయ డం లేదు. అటు మండల రెవెన్యూ సిబ్బందిలో కొందరు అన్నదాతలకు ఫోన్లు చేసి పరిహారం ఎక్కువ తామే ఇప్పించామని ఎకరాకు రూ.లక్ష వరకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. పైస్థాయిలో ఇచ్చుకోవాలంటూ సిబ్బందిని పంపించి వసూళ్ల వేట సాగిస్తున్నారు. ముఖ్యంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఓ కింది స్థాయి మహిళా అధికారి తనే వాటా కోసం చక్రం తిప్పుతున్నారు.

Updated Date - 2020-05-29T11:41:55+05:30 IST