బురదలో పడి రైతుకూలీ మృతి
ABN , First Publish Date - 2022-01-29T05:22:40+05:30 IST
వరి నాట్లు వేసిన పొలం బురదలో పడి ఓ గిరిజన రైతుకూలీ మృతి చెందాడు.
చిల్పచెడ్, జనవరి 28: వరి నాట్లు వేసిన పొలం బురదలో పడి ఓ గిరిజన రైతుకూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని జగ్గంపేటలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట గ్రామ పరిధిలోని రాంసింగ్ తండాకు చెందిన రమావత్ సామ్య (45) కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో చెరుకు నరికేందుకు కూలీ పని కోసం వెళ్లారు. అయితే ఇంటివద్ద చిన్న కూతురు ఉండడంతో గురువారం రాత్రి ఆమెను చూసేందుకు తండాకు వచ్చిన సామ్య త్వరగా ఇంటికి చేరాలనే ఆతృతతో పొలాల గుండా అడ్డదారిలో వెళ్తూ కనబడక వరినాట్లు వేసిన బురద మడిలో పడి మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య దేవులి, కుమారుడు రమేష్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారని తెలిపారు. కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు.