సాగునీటి బావిలో పడి రైతు మృతి
ABN , First Publish Date - 2022-08-11T06:46:57+05:30 IST
ప్రమాదవశాత్తు సాగునీటి బావిలో పడి రైతు మృతి చెందిన సంఘటన అనకాపల్లి మండలం మామడిపాలెంలో చోటుచేసుకుంది.
కొత్తూరు, ఆగస్టు 10 : ప్రమాదవశాత్తు సాగునీటి బావిలో పడి రైతు మృతి చెందిన సంఘటన అనకాపల్లి మండలం మామడిపాలెంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రూరల్ పోలీసు స్టేషన్ హెచ్సీ సత్యనారాయణ తెలిపిన వివరాలివి. మామిడిపాలెం గ్రామానికి చెందిన పీలా రామఅప్పలనాయుడు (38) రోజూ మాదిరిగానే మంగళవారం ఆవులను మేతకు తీసుకు వెళ్లాడు. సాయంత్రమైనా అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో గ్రామంలో, వ్యవసాయ పొలాల్లో వెతకసాగారు. బుధవారం తెల్లవారు జామున రాజుగారి కోనేరులో ఉన్న సాగునీటి బావిలో రామఅప్పలనాయుడు మృతదేహం తేలింది. ఇది గుర్తించిన రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయి ఉంటాడని బంధువులు చెబుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.