జాతీయస్థాయి ఐస్ స్కేటింగ్కు రైతు బిడ్డ .. అడ్డంకిగా పేదరికం
ABN , First Publish Date - 2022-05-15T18:47:07+05:30 IST
నిరుపేద రైతు కుటుంబానికి చెందిన క్రీడాకారుడు. ఐస్ స్కేటింగ్ జాతీయ స్థాయి సీనియర్ పోటీలకు ఎంపికయ్యాడు. కానీ పోటీలలో పాల్గొనేందుకు ఐస్ స్కేటింగ్ షూ, కిట్, ప్రయాణ ఖర్చులు లేకపోవడంతో పోటీలలో ఎలా పాల్గొనాలి ..
హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్ : నిరుపేద రైతు కుటుంబానికి చెందిన క్రీడాకారుడు. ఐస్ స్కేటింగ్ జాతీయ స్థాయి సీనియర్ పోటీలకు ఎంపికయ్యాడు. కానీ పోటీలలో పాల్గొనేందుకు ఐస్ స్కేటింగ్ షూ, కిట్, ప్రయాణ ఖర్చులు లేకపోవడంతో పోటీలలో ఎలా పాల్గొనాలి అని ఆవేదనకు గురవుతున్నాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సంతోష్ యాదవ్ దీనస్థితి ఇది. ఉన్నత చదువుల కోసం ఆయన హైదరాబాద్కు వచ్చి ఓయూలో ఉంటున్నాడు. స్కేటింగ్పై ఆసక్తితో బోడుప్పల్లోని శిక్షణా కేంద్రంలో కోచ్ సద్దాం హుస్సేన్ వద్ద ఐదేళ్లు శిక్షణ తీసుకున్నాడు.
శిక్షణకు కూడా డబ్బులు చెల్లించలేని సంతోష్ ఆర్థిక పరిస్థితిని గుర్తించి మానవతా దృక్పథంతో సద్దాం హుస్సేన్ ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ నెల 27న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ సీనియర్ పోటీలకు తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపికవ్వగా వారిలో సంతో్ష ఒకరు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు ఆర్థిక సాయం కోసం తెలిసిన వారిని, బంధుమిత్రులను సంప్రదించినా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. జాతీయ స్థాయి పోటీలో రాణించి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సంతో్ష ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దాతలు 99511 13833 ఫోన్ నంబర్లో సంప్రదించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.