ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-16T01:53:04+05:30 IST
బెంగళూరుకు చెందిన ప్రముఖ బైకర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ ప్రమాదంలో ..
జైసల్మేర్: బెంగళూరుకు చెందిన ప్రముఖ బైకర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ ప్రమాదంలో మృతిచెందారు. రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో గత బుధవారం రాత్రి ఆయన నడుపుతున్న బైక్ ఒక ఒంటెను ఢీకొంది. తలకు తీవ్రంగా గాయమైన శ్రీనివాసన్ మృతిచెందినట్టు పోలీసులు శుక్రవారంనాడు తెలిపారు. పోస్ట్మార్టం జరిపి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేశామని సంగర్హ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సోనారాం భాటి చెప్పారు.
ఫతేగఢ్ సబ్ డివిజన్లో బుధవారం రాత్రి తన ముగ్గురు మిత్రులతో కలిసి జైసల్మేర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు ఆయన మిత్రులు తెలిపారు. శ్రీనివాసన్ నడుపుతున్న బైక్ ముందుకు అకస్మాత్తుగా ఒక ఒంటె దూసుకు రావడంతో తలకు తీవ్ర గాయమై శ్రీనివాసన్ కన్నుమూశాడు.
శ్రీనివాసన్ బెంగళూరు నుంచి అనేక సార్లు సాహసయాత్రలు సాగించారు. ఆసియా, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలను తన టైగర్-800పై చుట్టేశారు. ఇటీవలే ఆఫ్రికా యాత్ర చేపట్టడం కోసం తన బీఎండబ్ల్యూ జీఎస్ను మరింత ఆధునీకరించారు.