గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-04-26T22:11:25+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఇటీవలే ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే దారుణహత్యకు..

గోరఖ్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఇటీవలే ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే దారుణహత్యకు గురైన సంఘటన మరువక ముందే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాకా గోరఖ్‌పూర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, అతని భార్య, కుమార్తెను దుండగులు పదునైన ఆయుధాలతో గొంతుకోసి ఇంటికి కొద్ది దూరంలోనే అత్యంత పాశవికంగా హత్య చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, రాయ్‌గంజ్‌లోని బంగ్లా చౌక్‌లోని వారి ఇంటికి 800 మీటర్ల దూరంలో ఈ హత్యలు చేటుచేసుకున్నాయి.


మృతులను గమ నిషద్ (42), అతని భార్య సంజు నిషద్ (38), కుమార్తె ప్రీతి (20)గా గుర్తించారు. ఈ కేసులో అలోక్ పాశ్వాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం కావడంతో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ''నిందితుని ఇంటరాగేట్ చేస్తున్నాం. ప్రీతిని అలోక్ ప్రేమిస్తున్నాడని తెలిసింది. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఈ హత్యల్లో నిందితులు ఒక పారను ఆయుధంగా ఉపయోగించారు'' అని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్గం కోసం పంపారు.

Updated Date - 2022-04-26T22:11:25+05:30 IST