మన గ్రోమోర్‌లో నకిలీ విత్తనాలు

ABN , First Publish Date - 2021-11-29T05:12:38+05:30 IST

వరి విత్తనాల బస్తాల్లో బియ్యంతో పాటు గడ్డి విత్తనాలు కలిసి ఉండడంతో కొనుగోలు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు.

మన గ్రోమోర్‌లో నకిలీ విత్తనాలు
కౌడిపల్లిలోని మన గ్రోమార్‌ షాప్‌ ఎదుట నకిలీ విత్తనాలను చూపిస్తున్న రైతులు

విషయం తెలిసినా పట్టించుకోని అధికారులు

లబోదిబోమంటున్న రైతులు 

కౌడిపల్లి, నవంబరు 28 : వరి విత్తనాల బస్తాల్లో బియ్యంతో పాటు గడ్డి విత్తనాలు కలిసి ఉండడంతో కొనుగోలు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కౌడిపల్లి మండలంలోని మన గ్రోమోర్‌ ఫర్టిలైజర్‌ షాపులో బురుగడ్డ గ్రామానికి చెందిన రైతులు కాశబోయిన వెంకటయ్య, ప్రేమ్‌, బర్ల నర్సింహులు వారంరోజుల క్రితం సోనం కంపెనీకి చెందిన సన్నరకం విత్తనాల ఐదు బస్తాలను కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత విత్తనాలను నానబెట్టే క్రమంలో బస్తాలను తెరిచి చూడగా వరి విత్తనాలతో పాటు బియ్యం, గడ్డి విత్తనాలు ఉన్నాయి. వెంటనే సంబంధిత షాపు అధికారులకు సమాచారం అందించారు. అయినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆదివారం మన గ్రోమోర్‌ షాపు వద్దకొచ్చి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రూ.5 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తే, పూర్తిగా కలుషితమైన విత్తనాలను విక్రయించడం ఏమిటని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు అమ్మడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట వేసిన నాటి నుంచి ధాన్యం అమ్మేవరకూ రైతులను ప్రతి ఒక్కరు దగా చేస్తున్నారని తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం ఓ పక్క చెబుతుంటే ఫర్టిలైజర్‌ షాపు యజమానులు మాత్రం నకిలీ విత్తనాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే షాపు యజమానులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-11-29T05:12:38+05:30 IST