మరికొన్నాళ్లు ‘ప్రత్యేక’మే!
ABN , First Publish Date - 2020-08-07T10:32:17+05:30 IST
మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
విజయనగరం నగర పాలక సంస్థకూ వర్తింపు
పాలవర్గాలు ఏర్పడే వరకు.. లేదా డిసెంబరు 31వరకు పెంపు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు విధించిన గడువు గురువారంతో ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలకు ప్రస్తుతం పాలక వర్గాలు లేని కారణంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. వీరి పదవీ కాలం ముగిసిన కారణంగా తిరిగి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31వరకు పదవీ కాలాన్ని పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు మరో ఐదు నెలల పాటు ప్రత్యేక అధికారులుగా మళ్లీ వారే కొనసాగనున్నారు. లేదా ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తే పాలక మండళ్లు అధికారంలోకి వచ్చే అవకాశమూ ఉంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. కొవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కు ప్రస్తుతం కలెక్టర్ హరిజవహర్లాల్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు.
యన ఈ ఏడాది డిసెంబరు 31వరకు మళ్లీ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. పార్వతీ పురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీకి ప్రత్యేక అధికారుల పదవీకాలం ఈ ఏడాది డిసెంబరు 31వరకు పొడిగించారు. పార్వతీపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సాలూరు ప్రత్యేకాధికారిగా జేసీ కిశోర్ కుమార్, బొబ్బిలి మున్సిపాలిటీకి జెసీ-2 కూర్మనాథ్, నెల్లిమర్ల నగర పంచాయతీ ప్రత్యేక అధికారిగా రీజనల్ డైరెక్టర్ కె.రమేష్ కొనసాగనున్నారు.