మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ దాడులు

ABN , First Publish Date - 2020-04-10T11:50:50+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు.

మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ దాడులు

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వైవీ భాస్కరరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌వీవీఎన్‌ బాబ్జీరావు ఆధ్వర్యంలో విజయనగరం రూరల్‌ పొలీస్‌స్టేషన్‌ హెచ్‌సీ రమణ, సర్కిల్‌-1 టౌన్‌ పరిధిలోని నాలుగు షాపులను గురువారం తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసివేసిన సమయంలో వున్న మద్యం సీసాలకు సంబంధించి రికార్డులు తీసి, ప్రస్తుతం వున్న మద్యం సీసాలను లెక్కలు చూసి తేడా ఉందో లేదో పరిశీలించారు. నగరంలోని వై జంక్షన్‌, వీటి అగ్రహారం, న్యూపూర్ణ, సిటీ బస్టాండ్‌, సమీపం లోని దుకాణాలను పరిశీలించారు. వీటిఅగ్రహారంలోని రెండు షాపుల్లో అమ్మకాలకు సంబంధించి ఒక షాపులో రూ.2,250, రెండో షాపులో రూ.4,770 జమ చేయాల్సి ఉన్నట్టు తనిఖీల్లో గుర్తించారు. ఈ నగదును శుక్రవారం బ్యాంకులో జమ చేయనున్నట్టు సర్కిల్‌-1 సీఐ సురేష్‌ తెలిపారు.


స్థానిక మెయిన్‌ రోడ్డు కూడలి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో ప్రొహిభిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పి.రామచంద్రరావు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం రూ.లక్షా 71వేల 380ల సరుకు తేడా ఉన్నట్టు గుర్తించారు. దుకాణం సూపర్‌వైజర్‌ నుంచి నగదు మొత్తాన్ని రికవరీ చేశారు. ఉన్నతాధికారులకు నివేదికను అందించి, తదుపరి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిభిషన్‌ సీఐలు బాలనరసింహ, చక్రవర్తి, ఎస్‌ఐ కే.రాజేష్‌, ఆడిట్‌ ఆఫీసర్‌ సురేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T11:50:50+05:30 IST