రీ నోటిఫికేషన్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-03-04T05:53:41+05:30 IST
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 7వ వార్డుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.
- మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు, మార్చి 3: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 7వ వార్డుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మాట్లాడుతూ నామినేషన్ల విత్డ్రా సమయం ముగిశాక ఏడోవార్డు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణకు ఎలా అనుమతించారని అధికారులపై మండిపడ్డారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. టీడీపీ అభ్యర్థి చివరినిమిషంలో బి.ఫారం సమర్పించినట్లు అధికారులే చెప్పారని, అయితే ఉపసంహరణ గడువు ముగిశాక మధ్యాహ్నం 3.15 గంటలకు పార్టీ అభ్యర్థి నామినేషన్ను ఎలా విత్ డ్రా చేయిస్తారని ప్రశ్నించారు. సీసీ ఫుటేజీని బయటపెట్టాలని, కార్యాలయంలోకి ఇతర పార్టీ నాయకులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. న్యాయబద్ధంగా గెలవలేక ప్రలోభాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిని భయబ్రాంతులకు గురిచేసి, తానే విత్డ్రా చేసినట్లు చెప్పించారని అన్నారు. ఆర్వో, పోలీసులు వైసీపీకి కొమ్ముకాసి ఏకగ్రీవమయ్యేందుకు సహకరించారని ఆరోపించారు. ఏడో వార్డు విత్డ్రాపై కోర్టుకు వెళతామని, న్యాయస్థానంపై తమకు నమ్మకముందని, న్యాయం జరుగుతుందని బీవీ అన్నారు.