కేసుల మాఫీ పైనే జగన్ దృష్టి
ABN , First Publish Date - 2022-06-27T05:21:42+05:30 IST
రాష్ట్రపతి ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలం ఉన్నా వైసీపీ ప్రజా ప్రతినిధుల ఓట్లు అవసరమైనప్పటికీ, ఇటువంటి సమయంలో రాష్ట్రానికి అవసరమైన డిమాండ్లను నెరవేర్చు కోకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం విమర్శించారు.
మాజీ మంత్రి పత్తిపాటి విమర్శ
చిలకలూరిపేట, జూన్ 26: రాష్ట్రపతి ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలం ఉన్నా వైసీపీ ప్రజా ప్రతినిధుల ఓట్లు అవసరమైనప్పటికీ, ఇటువంటి సమయంలో రాష్ట్రానికి అవసరమైన డిమాండ్లను నెరవేర్చు కోకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం విమర్శించారు. తన నివాస గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించటం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని పేర్కొన్నారు. తన అక్రమ కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి జగన్ బీజేపీతో అంట కాగుతున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి వెళ్ళిన నేతలను అడ్డుకొని అరెస్టులు చేయటం సిగ్గుచేటని ఆయన చెప్పారు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే మద్యంలో కొన్ని బ్రాండ్లు విషంతో సమానంగా ఉన్నట్టు వరుణ్ ల్యాబ్స్ వారి నివేదికలో వెల్లడైందని, దీని పై ప్రజలకు ఏం సమాధానం చెపుతారని ఆయన ప్రశ్నించారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను అమ్మటానికి సిద్ధపడటం అసమర్ధతేనని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ళు కట్టిస్తామని గొప్పలు చెపుతున్న వైసీపీ నేతలు చిలకలూరిపేటలో నిర్మించిన టిడ్కో గృహాలను మూడు సంవత్సరాలు గడిచినా ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు.