కార్యకర్తలే టీడీపీకి బలం
ABN , First Publish Date - 2022-08-10T05:15:11+05:30 IST
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నాయకులు ముందుండి పరిష్కరించాలని మాజీ మంత్రి, కైకలూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు పీతల సుజాత సూచించారు.
మాజీ మంత్రి పీతల సుజాత
కైకలూరు, ఆగస్టు 9 : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నాయకులు ముందుండి పరిష్కరించాలని మాజీ మంత్రి, కైకలూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు పీతల సుజాత సూచించారు. మంగళవారం కైకలూరు టీడీపీ కార్యాలయంలో బూత్స్థాయి, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ప్రతి నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవరకు నిరంతరంగా పోరాడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి 75 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారికి అండగా నాయకులు వ్యవహరించాలన్నారు. పెండింగ్లో ఉన్న బూత్ స్థాయి కమిటీల ను తక్షణమే నియమించాలన్నారు. ఒక అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అభివృద్ధిని గాలికి వదిలేసి పథకాల పేరుతో మోసం చేస్తుం దన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోనే బాదుడే బాదుడు కార్యక్రమంలో నియోజకవర్గం మూడో స్థానంలో ఉందని, మరింత దూకుడు పెంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇంటింటికి తిరుగుతామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్తనాగేంద్రకుమార్, చలసాని జగన్మోహన రావు, పార్టీల మండల అధ్యక్షులు పెన్మెత్స త్రినాఽథరాజు, తోకల జోగిరాజు, చల్లగుళ్ళ శోభనాద్రి చౌదరి, నారగాని వీర వెంకటనాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్లు వల్లభునేని శ్రీనివాసచౌదరి, తాడినాడ బాబు, నాయకులు ఎం.ఎ.రహీమ్, పి.జె.ఎస్. మాల్యాద్రి, బలే ఏసురాజు, రెడ్డి శ్రీనివాసచక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలి..
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేష్టలు చూస్తుంటే సీఎం, సలహాదారులు, మహిళామంత్రులకు సిగ్గువేయడం లేదా అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎన్నిరోజుల సమయం కావాలని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న సమయంలో కూడా ఎంపీ వీడియో నిజమో, కాదో తెలుసుకోవడానికి ఐదు రోజుల సమయం కావాలా అని ప్రశ్నించారు. తక్షణమే ఎంపీ మాధవ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.