తాటాకు చప్పుళ్లకు భయపడను!
ABN , First Publish Date - 2022-06-19T14:29:25+05:30 IST
అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం, ఆయన మద్దతుదారులంతా తానేదో ఘోరతప్పిదం చేసినట్లు విమర్శిస్తూ చేస్తున్న బెదిరింపులకు తాను
- Ex Minister Jayakumar
చెన్నై, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్సెల్వం, ఆయన మద్దతుదారులంతా తానేదో ఘోరతప్పిదం చేసినట్లు విమర్శిస్తూ చేస్తున్న బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి డి.జయకుమార్ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఏకనాయకత్వంపై చర్చ జరిగిందని, ఆ విషయాన్నే తాను మీడియా ముందు వెల్లడించానని చెప్పారు. అంత మాత్రానికే ఏకనాయకత్వం వివాదానికి తానే ప్రధాన కారకుడినంటూ పన్నీర్సెల్వం విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 23న జరుగనున్న సర్వసభ్యమండలిలో చేయాల్సిన తీర్మానాలపై తాజాగా పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరిపారని తెలిపారు. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలని తాను మాత్రమే కోరుకోవడం లేదని, పార్టీ శ్రేణులంతా కోరుతున్నారని చెప్పారు. ఏకనాయకత్వంపై పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని జయకుమార్ చెప్పారు.