Edappadi Palaniswami: ఎన్ని అవతారాలెత్తినా విచ్ఛిన్నం చేయలేరు
ABN , First Publish Date - 2022-08-09T13:48:20+05:30 IST
ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్ని అవతారాలెత్తినా తమ పార్టీని విచ్ఛిన్నం చేయలేరని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి
- అన్నాడీఎంకే నేత ఈపీఎస్
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 8: ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్ని అవతారాలెత్తినా తమ పార్టీని విచ్ఛిన్నం చేయలేరని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswam) స్పష్టం చేశారు. దిండుగల్ జిల్లా పళని ఆలయాన్ని సోమవారం దర్శించుకున్న ఎడప్పాడి దండాయుధపాణిస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు అధికారం చేపట్టిన డీఎంకే(DMK) 14 నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను, విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఆసక్తి చూపుతోందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్ధంగా మారాయన్నారు. కార్యకర్తలు దేవాలయంగా భావిస్తున్న పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కొందరు ద్రోహులు విధ్వంసం చేశారని, కార్యాలయంలోని పలు పత్రాలు దోచుకెళ్లినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈపీఎస్(EPS) వ్యాఖ్యానించారు.