Chidambaram: ఏ వస్తువు పట్టుకున్నా షాక్
ABN , First Publish Date - 2022-08-14T13:11:19+05:30 IST
గతంలో విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజలకు షాక్ కొట్టేదని, ప్రస్తుత బీజేపీ పాలనలో అన్ని వస్తువులు షాక్ కొట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి పి.
- బీజేపీ పాలనపై చిదంబరం ఆగ్రహం
- టీఎన్సీసీ అధ్యక్ష పదవికి నేనే అర్హుడిని
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 13: గతంలో విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజలకు షాక్ కొట్టేదని, ప్రస్తుత బీజేపీ పాలనలో అన్ని వస్తువులు షాక్ కొట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం(Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం శివగంగ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న చిదంబరం మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. 1947లో కాంగ్రెస్(Congress) అధికారం చేపట్టిన అనంతరం భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించిందన్నారు. ప్రస్తుత బీజేపీ పాలన తిరోగమనంలో దేశ ఆర్ధికాభివృద్ధి, నిరుద్యోగం పెరగడం తదితరాలతో కొనసాగుతోందన్నారు. ప్రజలపై భారాలు మోపి కార్పొరేట్లకు రాయితీలిచ్చే విధంగా బీజేపీ పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం హోల్ సేల్, రిటైల్లో ఏ వస్తువు పట్టుకున్నా ప్రజలకు షాక్ కొట్టే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ(State Congress Committee) అధ్యక్షుడిగా తనను ఎంపిక చేయడానికి 101 శాతం అర్హత వుందని, ఆ మేరకు అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానవర్గం తనను ఎంపిక చేయనున్నదని చిదంబరం ప్రకటించారు.