వారితో పెట్టుకున్న వారెవ్వరూ బాగుపడలే..: ఈటెల రాజేందర్
ABN , First Publish Date - 2022-01-11T21:07:23+05:30 IST
317 జీవో వల్ల అన్యాయానికి గురై.. గుండె పగిలి.. ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఒక్క...
మహబూబ్నగర్: 317 జీవో వల్ల అన్యాయానికి గురై.. గుండె పగిలి.. ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఒక్క తెలంగాణలోనే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం, మహబూబ్నగర్లో 317 జీవోకు నిరసనగా.. ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సమస్యలపై నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఉద్యోగులు ఉపాధ్యాయులతో పెట్టుకున్నావు.. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని పాతర వేస్తారు.. వారితో పెట్టుకున్న వారెవ్వరూ బాగుపడలే.. నీది పుట్ట పార్టీ.. ఈ ప్రాంతంలోని పార్టీ బీజేపీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ.. నీ వికృత చేష్టలు.. అణిచివేతలు ఇలాగే ఉంటే..కబర్దార్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైతు ఉత్సవాలు జరుగుతున్నాయని, ఒక్క మనిషి లేడని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం వెంట ఏ కులం, ఏ వర్గం లేదని, ఆలంపూర్ నుంచి అదిలాబాద్ దాకా ఒకటే నినాదం.. ఒకటే అజెండా అని.. సీఎం కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యమని అన్నారు. కౌలు రైతులకు ఎమైనా న్యాయం చేశారా? అని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏ పంట వెయ్యమంటే ఆ పంట వేశారని, పాలమూరు.. కాళేశ్వరం కడుతున్నమని అన్నరు.. ఇపుడు వరి పంట వద్దంటున్నారు. మరి అన్ని నీళ్లుంటే ఏ పంట పండుతుందని ప్రశ్నించారు.
తమకు అండగా ఉన్న వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ‘‘ఇది ఎన్ని రోజులు సాగుతుంది.. మీది ఆరిపోయే దీపం.. హుజూరాబాద్లో ఎట్లా చెంప చెళ్లుమనిపించినరో.. మొత్తం తెలంగాణాలో కూడా మిమ్మల్ని బొంద పెడతారు.. బీజేపీకి పట్టం కడతారు.. పాలమూరు ఎప్పటికీ బీజేపీకి అండగా ఉంటుంది.. వచ్చే ఎన్నికల్లో పద్నాలుగు సీట్లల్లో బీజేపీని గెలిపిస్తరని’’ ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.