ఆకాశంలో నిత్యావసరాలు

ABN , First Publish Date - 2020-10-31T10:14:20+05:30 IST

విపరీతంగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నాయి.ఆహారం కాస్త రుచిగా వండుకోవాలంటే

ఆకాశంలో నిత్యావసరాలు

కడుపు మాడ్చుకుంటున్న సామాన్యులు


చిత్తూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): విపరీతంగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందకుండా పోతున్నాయి.ఆహారం కాస్త రుచిగా వండుకోవాలంటే అవసరమైన పప్పు, నూనె,ఉల్లి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.కరోనాకు ముందు రెండంకెల్లో ఉన్న సరుకుల ధరలు మూడంకెలు దాటేశాయి.నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలవారీ ఖర్చు అదనంగా రూ.2 వేలు పెరగడంతో సామాన్యుల గుండె బరువెక్కుతోంది. కరోనా ప్రభావంతో అసలే ఆదాయం తగ్గి అవస్థలు పడుతున్న సగటు జీవి బతుకు భారంగా మారింది. కరోనా ముందు ధరలతో పోలిస్తే.. వేరుశనగ, సన్‌ఫ్లవర్‌, పామాయిల్‌ లీటరుపై రూ.30 దాకా పెరిగింది. కంది, ఉద్దిపప్పులు కూడా కొనలేని పరిస్థితి.లాక్‌డౌన్‌, ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగాయి. ఆ ప్రభావం సరుకులపై పడింది. భారీ వర్షాలకు పంట దెబ్బ తినడంతో ఉల్లి ఘాటెక్కింది. కిలో రూ.వంద దాకా పలుకుతుండడంతో కూరల్లో ఉల్లి మాయమవుతోంది.


రెస్టారెంట్లు, హాటళ్లలో ఉల్లి వాడే అల్పాహార ధరలు పెరిగాయి. భారీ వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలో ఎక్కువగా సాగయ్యే కర్నూలులో ఉల్లి పంట బాగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తోంది. ఈ కారణంగా ధర అమాంతం పెరిగింది.కరోనా వ్యాప్తితో మసాలాలకూ గిరాకీ పెరిగింది. కొవిడ్‌ నుంచి రక్షణ పొందాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. దగ్గు, జలుబు వంటివి దరి చేరకుండా చూసుకోవాలి. దీంతో జనం పౌష్టికాహారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో మసాలా దినుసులు, ధనియాలు, ఎండుమిర్చి వంటి వాటి వాడకం పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి.


గత మూడు నెలల్లో నిత్యావసరాల ధరల పెరుగుదల 

సరుకులు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు

వేరుశనగ నూనె 120 130 150

సన్‌ఫ్లవర్‌ 96 105 120

పామాయిల్‌ 78 85 95

వేరుశనగ గింజలు 120 90 120

కంది పప్పు 86 100 120

ఉద్ది పప్పు 95 118 128

మినప పప్పు 85 95 110

మిరియాలు 400 420 450

ధనియాలు 80 90 105


Updated Date - 2020-10-31T10:14:20+05:30 IST