కూలీలపై పిడుగు
ABN , First Publish Date - 2020-06-04T11:03:53+05:30 IST
ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలపై పిడుగుపడి భయాందోళకు గురిచేసింది.
‘ఉపాధి’ చెరువులో ఘటన
24 మంది కూలీలకు గాయాలు
కాకినాడ ఆసుపత్రికి నలుగురి తరలింపు
శంఖవరం, జూన్ 3: ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలపై పిడుగుపడి భయాందోళకు గురిచేసింది. అపస్మారక స్థితికి చేరుకున్న కూలీలు విలవిల్లాడారు. మరికొందరు ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. శంఖవరం మండలం నెలిపూడిలో పోలూరి చెరువులో 130 మంది కూలీలు పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం తొమ్మిదింటికి వర్షం రావడంతో వారంతా బరకం కిందికి చేరారు. ఒక్కసారిగా మెరుపులతో కూడిన శబ్ధం రావడంతో కొంతమంది పరుగులు తీశారు. పిడుగుపాటుకు 20మందికి స్వల్పగాయాలయ్యాయి. మరో నలుగురు స్పృహ కోల్పోయా రు. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. స్పృహ కోల్పోయిన కాలిన అమ్మాజీ, పిర్ల కనకలక్ష్మి, తలపంటి జోగిరాజు, యనమల అప్పలకొండను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
ప్రత్తిపాడులో బాధితులకు చికిత్స
ప్రత్తిపాడు : ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం పిడుగుపాటు బాధితులకు వైద్య సేవలందించారు. బుధవారం రాత్రి 18 మందికి చికిత్సలు పూర్తిచేసి స్వస్థలాలకు పంపేశారు. స్థానిక ఆసుపత్రిలో మిగిలిన బాధితులకు వైద్య సేవలందిస్తున్నట్టు వైద్యురాలు స్వప్న తెలిపారు. బాధితులను ఎమ్మెల్యే పర్వతప్రసాద్, డ్వామా పీడీ శ్యామల పరామర్శించారు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయపడిన కూలీలను ఆదుకుంటామన్నారు.
భయాందోళను గురయ్యాం..కుక్కా సూర్యచంద్ర, ఉపాధి కూలీ
పనులు నిర్వహిస్తుండంగా వర్షం రావడంతో బరకం వేసుకుని చెట్లకింద కూర్చున్నాం. ఒక్కసారిగా భారీశబ్దం రావడంతో భయంతో పరుగులు తీశాం. బతుకుతామనుకోలేదు.