ఫార్మాసిటీ పనుల్లో ఉపాధి కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:29:20+05:30 IST

ఫార్మాసిటీ పనుల్లో ఉపాధి కల్పించాలి

ఫార్మాసిటీ పనుల్లో ఉపాధి కల్పించాలి
తాడిపర్తిలో జేసీబీకి అడ్డుతగిలి పనులను ఆడ్డుకుంటున్న గ్రామస్థులు

  • పేదలకు తక్షణమే ఇళ్లస్థలాలు కేటాయించాలి
  •  తాడిపర్తి గ్రామస్థుల ఆందోళన 
  • పోలీసులు సర్ధిచెప్పడంతో శాంతించిన గ్రామస్థులు

యాచారం :  ఫార్మాసిటీ కోసం చేపడుతున్న పనుల్లో స్థానికులకు కాకుండా ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారని తాడిపర్తి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధి తాడిపర్తి గ్రామంలో గత వారంరోజులుగా ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎ్‌సఐఐసీ అధికారులు భారీ ఇనుపరాడ్లతో కంచె వేసే పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. బుధవారం తాడిపర్తి-గొల్లగూడ గ్రామాల మధ్య జేసీబీతో  రహదారులు వేసేందుకు సంబంధిత కాంట్రాక్టరు ద్వాఆ అధికారులు భూమిని చదును చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను జేసీబీతో సహాయంతో తొలగిస్తుండగా తాడిపర్తి గ్రామస్థులు అడ్డుతగిలారు. తమకు నిలువ నీడలేదని, ఇండ్లు కట్టుకునేందుకు ఈ స్థలం వదలాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది గ్రామస్థులు ఆందోళనకు దిగారు. జేసీబీకి అడ్డుగా వచ్చి పనులు ఆపాలని డిమాండ్‌ చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పనులు నిర్వహిస్తున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా పోలీసులతో గ్రామస్థులు మాట్లాడుతూ.. ఇండ్లకు ఆనుకొని ఇనుపరాడ్లతో కంచె వేశారని, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం వరకు భూమిని వదలిపెట్టి ఇనుప కంచెను వేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాగైతే మేం ఎలా బతకాలి, మాకు దారి చూపండి అంటూ పోలీసుల ఎదుట వాపోయారు. తక్షణమే పనులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ జేసీబీకి అడ్డు తగిలారు. ఫార్మాసిటీ పనుల్లో కేవలం గ్రామానికి చెందిన వారికే  ఉపాధి చూపాలని ఈ సందర్భంగా గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. తాడిపర్తి గ్రామంలో పనులు నడుస్తుండగా వేరే ఇతర ప్రాంతానికి చెందినవారికి  ఏ విధంగా ఉపాధి చూపుతారని సిబ్బందిని, పోలీసులను ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. దీంతో సీఐ లింగయ్య, ఎస్సై ప్రభాకర్‌లు సంబంధిత అధికారులతో మాట్లాడి, ఫార్మాసిటీ పనుల్లో గ్రామస్థులకు ఉపాధి చూపిస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో తాడిపర్తి గ్రామస్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:29:20+05:30 IST