నేటి నుంచి ఉపాధి గ్రామసభలు
ABN , First Publish Date - 2022-10-02T05:54:33+05:30 IST
ప్రస్తుత సీజన్ ఉపాధి పనుల లక్ష్యాన్ని మించి చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది (2022-23) కార్యాచరణ ప్రణాళికపై ఆ శాఖ యంత్రాంగం దృష్టి సారించింది.
వచ్చే ఏడాదికి పనుల గుర్తింపు ప్రారంభం
ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 1.36 కోట్ల పని దినాలు
పనుల కల్పనలో రెండో స్థానం
సగటు వేతనంలో వెనుకంజ
జిల్లాల విభజనతో క్లస్టర్ల కుదింపు, సిబ్బంది సర్దుబాటు
ఒంగోలు, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్ ఉపాధి పనుల లక్ష్యాన్ని మించి చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది (2022-23) కార్యాచరణ ప్రణాళికపై ఆ శాఖ యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం అధికారులు జిల్లావ్యాప్తంగా ఈనెల 2 నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. జిల్లాలో గత కొన్నేళ్లుగా ఉపాధి పనులు పెద్దఎత్తున జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్నంత వేగం కనిపించకపోయినప్పటికీ పనుల కల్పన, మెటీరియల్ కోటా ద్వారా సచివాలయాలు, ఆర్బీకే భవన నిర్మాణాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అధికంగా కూలీలకు పనుల కల్పనలో ముందు వరుసలో జిల్లా ఉంది. ప్రస్తుత ఏడాది (2021-22)లో జిల్లాలోని 38 మండలాల్లో కోటి 20 లక్షల పనిదినాల కల్పన లక్ష్యంకాగా కోటి 36లక్షల వరకు ఇప్పటికే కల్పించారు. అలా పనిదినాల కల్పనలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అయితే సగటు వేతనంలో మాత్రం చివరి వరుసకు పడిపోయింది.
గ్రామం యూనిట్గా సభలు
పథకం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో గ్రామం యూనిట్గా గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. దీంతో ఆదివారం నుంచి గ్రామసభల నిర్వహణకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ ఆదేశాలపై రెండు రోజులుగా క్లస్టర్ ఏపీడీలతో డ్వామా పీడీ శీనారెడ్డి సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ నెలాఖరులోగా పనుల గుర్తింపు పూర్తిచేసి గ్రామ ప్రణాళికలను వచ్చేనెల 13లోపు చేయాలని, అలాగే నవంబరు 15లోపు పంచాయతీల అనుమతులు పొంది అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అలా మండల ప్రణాళికలు డిసెంబరు 1 నాటికి, జిల్లా ప్రణాళికలు డిసెంబరు 15కు పూర్తిచేసి మండల, జిల్లా పరిషత్ల అనుమతులు పొంది డిసెంబరు ఆఖరుకు వివిధస్థాయిల్లో పనులకు పరిపాలన ఆమోదం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.