నేటినుంచి ఉద్యోగ సంఘాల నిరసనలు
ABN , First Publish Date - 2021-12-07T07:09:09+05:30 IST
పీఆర్సీతోపాటు ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుంచి నిరసన బాట పట్టనున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 6: పీఆర్సీతోపాటు ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుంచి నిరసన బాట పట్టనున్నారు. వచ్చే ఏడాది జనవరి ఆరో తేదీవరకు వివిధ దశలుగా నిరసనలు తెలియజేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను సోమవారం రాత్రి కలెక్టర్ హరినారాయణన్కు నాయకులు అందించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్ అన్వర్ బాషా, చైర్మన్ అమర్, ఏపీ జేఏసీ చైర్మన్ రాఘవులు తదితరులు మీడియాతో మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం కరువు భత్యం పెంచకుండా వాయిదాలు వేయడం శోచనీయమన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో నిరసనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. నిరసనల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు ఆర్టీసీ కార్మికులు, ఇతర వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నేతలు రఘు, చంద్రబాబు, ప్రదీప్, పన్నీర్ సెల్వం, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.