16మంది వెళ్లారు.. 8మందిని గుర్తించాం

ABN , First Publish Date - 2020-03-29T10:37:45+05:30 IST

చీరాలలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తితో పాటు ఆ ప్రాంతంలో 16 మంది నిజాముద్దీన్‌ వెళ్లారని, వారిలో ఎనిమిది

16మంది వెళ్లారు.. 8మందిని గుర్తించాం

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులతో అత్యవసర  సమావేశం


చీరాలటౌన్‌, మార్చి 28 : చీరాలలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తితో పాటు ఆ ప్రాంతంలో 16 మంది నిజాముద్దీన్‌ వెళ్లారని, వారిలో ఎనిమిది మందిని గుర్తించామని, వారిని ఒంగోలు రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. చీరాలలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారికంగా సమాచారాన్ని ఆయన శనివారం వెల్లడించారు.


కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కలెక్టర్‌ హుటాహుటిన శనివారం రాత్రి చీరాలకు చేరుకున్నారు. అధికారులతో మునిసిపల్‌ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధితుడు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ప్రయాణాలు చేశాడు. ఎవరెవరితో దగ్గరిగా ఉన్నాడు.. అనే వివరాలను ఆరాతీసే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు. బాధితుడితోపాటు చీరాలకు చెందిన వారు 16మంది ప్రయాణం చేశారన్నారు. వారిలో ఎనిమిది మందిని గుర్తించామని, వారి నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిగిలిన వారిని త్వరలో గుర్తిస్తామని, అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. వారికి వారుగా స్వచ్ఛందంగా క్యారంటైన్‌లో పాల్గొనాలని హెచ్చరించారు.


అంతేకాకుండా నవాబ్‌పేటలోని బాధితుల నివాసస్థలాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. దాని చుట్టుపక్కల మూడు కిలోమీటర్లలోపు ఎటువంటి రాకపోకలు ఉండరాదన్నారు. దానిని నిషేధిత ప్రాంతంగా పరిగణించాలని పేర్కొన్నారు. శనివారం సాయంత్రమే మునిసిపల్‌ అధికారులు కలెక్టర్‌ సూచనలు మేరకు ఆ ఏరియా అంతా మందులు చల్లించారు. పోలీసుల బందోబస్తు ఉంచారు. కార్యక్రమంలో జేసీ2 షన్మోహన్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T10:37:45+05:30 IST