ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు
ABN , First Publish Date - 2020-07-08T11:48:52+05:30 IST
ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో అక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.
సంగారెడ్డి టౌన్, జూలై 7 : ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో అక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. గతంలో ‘ఆంధ్రజ్యోతి‘లో ప్రచురితమైన వరుస కథనాలపై స్పందించిన రెవెన్యూ అధికారులు అక్రమంగా ఏర్పాటుచేసిన డబ్బాలను మంగళవారం తొలగించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఉన్న 109 సర్వే నంబర్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరఢా ఝులిపించారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 38 గుంటల భూమిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పార్కు కోసం కేటాయించిన 500 చదరపు గజాల స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన 8 డబ్బాలను ఎక్స్కవేటర్ సహాయంతో తొలగించారు. ‘పార్కు స్థలాల్లో పెద్దల పాగా’, ‘మాలకుంట కట్టను మింగేశారు’ అక్రమాలపై కలెక్టర్ నజర్ అనే శీర్షికలతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమయ్యాయి.
ఈ కథనాలపై వెంటనే స్పందించాలని గతంలో కొంతమంది స్థానికులు కలెక్టర్ హన్మంతరావుకు కలిసి అక్రమార్కులపై ఫిర్యాదు చేయగా అక్టోబర్ 19న ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి నోటీసులపై ఆక్రమణదారులు స్పందించకపోవడంతో తహసీల్దార్ స్వామి నెల రోజుల క్రితం వెంటనే డబ్బాలను తొలగించాలని, లేనియెడల తామే కూల్చివేస్తామని హెచ్చ రించారు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో మంగళవారం పోలీసుల బందోబస్తు మధ్య వాటిని తొలగించారు. దీంతో కోపోద్రిక్తులైన కబ్జాదారులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రెండు మూడు రోజుల్లోగా ఈ స్థలంలో ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.