మండే ఎండలో పిల్ల ఏనుగుపై చల్లని నీళ్లు.. దాని డీజే టిల్లు స్టెప్స్ చూడాల్సిందే!

ABN , First Publish Date - 2022-04-09T16:17:45+05:30 IST

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి.

మండే ఎండలో పిల్ల ఏనుగుపై చల్లని నీళ్లు.. దాని డీజే టిల్లు స్టెప్స్ చూడాల్సిందే!

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రజలు ప్రతిరోజూ ఎండ వేడిమిని ఎదుర్కోవలసి వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అందులో జూలో ఒక పిల్ల ఏనుగు తనపై పడుతున్న చల్లని నీటికి ఎంతగానో ఆనందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో జంతుప్రదర్శనశాల సిబ్బంది ఒక ఏనుగు, దాని పిల్ల ఏనుగుకు వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు నీటిని చిలకరించడాన్ని చూడవచ్చు, ఈ సమయంలో పిల్ల ఏనుగు తనపై పడుతున్న చల్లని నీటితో ఆడుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది.




సాధారణంగా అడవుల్లో ఏనుగు పిల్లలు అల్లరి చేస్తూ, సరదాగా గడుపుతుంటాయి. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఏనుగు తల్లి ప్రశాంతంగా నిలబడి ఉండగా, పిల్ల ఏనుగు మాత్రం నీళ్లతో సరదాగా గడుపుతున్న దృశ్యం చూపరులను నవ్విస్తుంది. అది నీటితో అలా ఆడుకోవడాన్ని చూసిన యూజర్లు తెగ మురిసిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఈ వీడియో ఉపమనాన్ని కలిగిస్తున్నదని పలువురు కామెంట్ చేస్తున్నారు.  ఇప్పటివరకూ ఈ వీడియో 57 వేలకు పైగా వీక్షణలను పొందింది. 4 వేల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేసారు. చాలామంది యూజర్స్ ఏనుగు పిల్ల విన్యాసాలు ముచ్చటేస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-09T16:17:45+05:30 IST