విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-12-08T04:36:41+05:30 IST
విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దుచేసి, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి డిమాండ్ చేశారు.
- సినీనటుడు నారాయణమూర్తి
కల్వకుర్తి, డిసెంబరు 7 : విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దుచేసి, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల డిమాండ్లను పరిష్కరించి, వారిని అన్నివిధాలుగా సహకరించాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహానికి కేంద్రం గురికాక తప్పదని అన్నారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దుచేయడం, రైతుల విజయమని ఆయన పేర్కొన్నారు. తాను తీసిని రైతన్న సినిమా రైతుల గురించే ఉందని, ఈనెల 11న కల్వకుర్తి పట్టణంలోని పార్దసారథి ఽథియేటర్లో ఉదయం షో నడుస్తుందని తెలిపారు. వారంరోజుల పాటు నిర్వహించే షోను రైతులతోపాటుగా ప్రతీ ఒక్కరు చూడాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతు పోరాటంలో చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 3లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇదేమాదిరిగా ప్రధాని మోదీ సైతం రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు నాయకులు ఆయనను సన్మానించారు. సమావేశంలో సీపీఎం నాయకులు చిలుక బాల్రెడ్డి, ఏపీ మల్లయ్య, ఆంజనేయులు, బాలస్వామి, లక్ష్మయ్య, శ్రీనివాసులు, సీపీఐ ఇన్చార్జి పరుశరాములు తదితరులున్నారు.
రైతు ఆత్మబలిదానాలతోనే రైతు చట్టాల రద్దు
వెల్దండ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు వారి ఆత్మబలిదానాలతోనే రద్దు అయ్యాయని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి నారాయణమూర్తి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆజ్యంపోసే విధంగా నీళ్ల విషయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించడం సబబుకాదని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై చిత్రీకరించిన రైతన్న సినిమాను ఆదరించాలని నారాయణమూర్తి కోరారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నారాయణమూర్తిని సత్కరించారు. సమావేశంలో సర్పంచ్ భూపతిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సంజీవ్కుమార్, రైతుసమన్వయసమితి చైర్మన్ భాస్కర్రావు, ఎంపీటీసీ వెంకటయ్య, సర్పంచ్ పత్యానాయక్, నారాయణ, రవికుమార్గౌడ్ తదితరులున్నారు.