Shock: ఇంటికి రూ.లక్ష
ABN , First Publish Date - 2022-08-21T14:30:33+05:30 IST
స్థానిక పెరుంబాక్కంలో బిల్లుల రూపంలో కరెంట్ షాక్ కొడుతోంది. మధ్యతరగతి ప్రజల నివాసాలకు రూ.లక్ష చొప్పున బిల్లు రావడమే ఇందుకు
- వామ్మో! కరెంటు బిల్లు షాక్!
- పెరుంబాక్కంలో ఇంటికి రూ.లక్ష చొప్పున బిల్లు
- సుమారు 100 గృహాలకు ఇదే తంతు
- లబోదిబోమంటున్న వినియోగదారులు
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 20: స్థానిక పెరుంబాక్కంలో బిల్లుల రూపంలో కరెంట్ షాక్ కొడుతోంది. మధ్యతరగతి ప్రజల నివాసాలకు రూ.లక్ష చొప్పున బిల్లు రావడమే ఇందుకు కారణమైంది. దీంతో అక్కడి స్థానికులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. తమిళనాడు మెట్రోపాలిటన్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్(Tamil Nadu Metropolitan Housing Board Quarters)లో నివసిస్తున్న ప్రవీణ్కుమార్ అనే వ్యక్తితో పాటు మరో వంద మందిదాకా తలా రూ. లక్ష చొప్పున బిల్లులు వచ్చాయి. విద్యుత్ ఉద్యోగులు మీటర్ రీడింగ్ సరిగ్గా చేపట్టని కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలకొకసారి రీడింగ్ తీస్తుండగా, ఈ ప్రాంతంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్బోర్డు సిబ్బంది.. ఏడాదికొకసారి మీటర్ రీడింగ్ తీస్తున్నారు. దీంతో బిల్లు మోత మోగుతోందని స్థానికులు చెబుతున్నారు. దీని గురించి క్వార్టర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లతంబి మాట్లాడుతూ.. సకాలంలో రీడింగ్ తీయకుండా ఏడాదికి ఒకసారి మీటర్ రీడింగ్ చేపట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఈ ప్రాంతంలో 20 వేల కుటుంబాలు నివసిస్తుండగా, 5 వేల కుటుంబాలకు ఇలానే బిల్లులు వస్తున్నాయన్నారు. విద్యుత్శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి రెండు నెలలకు ఒకసారి రీడింగ్ తీసేలా చర్యలు చేపట్టాలని నల్లతంబి విజ్ఞప్తి చేశారు.