కందులాపురంలో విద్యుత్‌ షార్ట్‌సర్యూట్‌

ABN , First Publish Date - 2021-01-25T05:36:17+05:30 IST

కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఉన్న నివాస గృహాలలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సుమారు 20కిపైగా గృహాలలో వస్తువులన్నీ కాలిపోయాయి.

కందులాపురంలో విద్యుత్‌ షార్ట్‌సర్యూట్‌
నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

కంభం, జనవరి 24 : కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఉన్న నివాస గృహాలలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సుమారు 20కిపైగా గృహాలలో వస్తువులన్నీ కాలిపోయాయి. రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కందులాపురం పంచాయతీ పరిధిలోని మాలకొండ సమీపంలో పలువురు పేదలు పక్కాగృహాలు నిర్మించుకుని జీవిస్తున్నారు. నివాస గృహాలపై నుంచి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుండి బేస్తవారపేట మండలానికి విద్యుత్‌ సరఫరా అందించే 33/11 కేవీ ప్రధాన లైన్‌ వెళుతోంది. ఈ లైన్లు ఒకదానికొకటి తగలడంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఈలైన్‌ వెళ్లే సమీప గృహాల్లో విద్యుత్‌ బోర్డులో పగిలిపోయి మంటలు రావడమేకాక ఆయా గృహాల్లోని టీవీలు, కంప్యూటర్లు, ఫ్యాన్లు, లైట్లు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. వెన్న శ్రీనివాసులు గృహంలోని ఫ్యాన్‌, టీవీ షేక్‌ బాబాకు చెందిన కంప్యూటర్‌, ప్రింటర్‌, జిరాక్స్‌ మిషన్‌, అనీల్‌కు చెందిన ఫ్యాన్‌, కూలర్‌, ఫ్రిజ్‌, సతీ్‌షకుమార్‌కు చెందిన ఫ్యాన్‌, టివి ఇలా సుమారు 20 కుటుంబాలలో పరికరాలు కాలిపోయి రూ10లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడమేకాక విద్యుత్‌ లైన్‌ను మార్పించాల్సిందిగా కోరారు. విషయం తెలుసుకున్న బేస్తవారపేట విద్యుత్‌ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. తెగిపోయిన విద్యుత్‌లైన్‌ను పునరుద్దరించడంలో గంటకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Updated Date - 2021-01-25T05:36:17+05:30 IST