Shiv Sena : ఉద్దవ్ థాకరేకు మరో షాకిచ్చిన షిండే

ABN , First Publish Date - 2022-10-02T20:45:06+05:30 IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని

Shiv Sena : ఉద్దవ్ థాకరేకు మరో షాకిచ్చిన షిండే

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గానికి ఆదివారం గట్టి షాక్ తగిలింది. ఆ వర్గానికి చెందిన దాదాపు 3,000 మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిపోయారు. వీరంతా ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందినవారు. థాకరే వర్గం దసరా సందర్భంగా భారీ సభను నిర్వహించబోతున్న తరుణంలో ఈ షాక్ తగిలింది. 


శివాజీ పార్కులో దసరా ర్యాలీ నిర్వహణకు ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు బోంబే హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో 3,000 మంది కార్యకర్తలు షిండే వర్గంలోకి వెళ్ళిపోవడం ఉద్ధవ్‌కు గట్టి ఎదురు దెబ్బ. మరోవైపు వీరంతా ఆదిత్య థాకరే నియోజకవర్గం అయిన వర్లీకి చెందినవారు కావడం మరింత దిగ్భ్రాంతికరం. 


మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం జూన్‌లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి, బీజేపీతో పొత్తు పెట్టుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమదే అసలైన శివసేన అని గుర్తించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం ఇరు వర్గాలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. 



Updated Date - 2022-10-02T20:45:06+05:30 IST