పుష్పబాణ హస్తే!

ABN , First Publish Date - 2020-10-23T09:58:09+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరోరోజైన గురువారం దుర్గమ్మ మంత్రాది దేవత అయిన లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు..

పుష్పబాణ హస్తే!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరోరోజైన గురువారం దుర్గమ్మ మంత్రాది దేవత అయిన లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చెరకుగడను చేతబట్టుకుని.. చతుర్భుజాలతో పాశము, అంకుశము, పుష్పబాణాలు, ధనస్సు ధరించి, పరమశివుని వక్షస్థలంపై ఆసీనురాలైన లలితాదేవిని సహస్ర నామాలతో భక్తులు స్తుతించారు. 


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరోరోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులు దర్శించుకున్నారు. మహామండపంలోని ఆరో అంతస్తులో సాయంత్రం ఘనంగా అర్చక సభను నిర్వహించారు. 50 మంది అర్చకులను సన్మానించి నగదు పురస్కారాలను అందజేశారు. సాయంత్రం 6.30 గంటలకు వేదపండితులు అమ్మవారికి మహానివేదన సమర్పించి, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహించారు. 


అనంతరం గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు వైభవంగా పల్లకీ సేవ నిర్వహించారు. 


టీటీడీ, శ్రీకాళహస్తి ఆలయాల నుంచి సారె

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి ఆలయాల అధికారులు గురువారం కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలతో సారె సమర్పించారు. సారె తీసుకువచ్చిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ ఈవో సీహెచ్‌ చంద్రశేఖరరెడ్డి, ఇతర ఆలయ అధికారులకు దుర్గగుడి వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. టీటీడీ తరపున పాలకమండలి సభ్యుడు కొలుసు పార్థసారథి, ఆలయ అధికారులు అమ్మవారికి సారె సమర్పించారు. 


విజయవాడకు చెందిన మేకపాటి మంజుల శిష్యబృందం కొండపై మహాగోపురం ఎదట నృత్య ప్రదర్శనతో భక్తులను అలరించారు. శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Updated Date - 2020-10-23T09:58:09+05:30 IST