భూ రీసర్వేకు పెరగనున్న డ్రోన్లు
ABN , First Publish Date - 2022-07-05T06:53:16+05:30 IST
భూ రీ సర్వే కోసం వచ్చే వారం నుంచి డ్రోన్ల సంఖ్యను మరిన్ని పెంచేందుకు నిర్వాహకులు అంగీకరించినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 4: భూ రీ సర్వే కోసం వచ్చే వారం నుంచి డ్రోన్ల సంఖ్యను మరిన్ని పెంచేందుకు నిర్వాహకులు అంగీకరించినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ఈ క్రమంలో భూరీసర్వే పనులు వేగవంతం కావాలన్నారు. సోమవారం ఆయన చిత్తూరులోని తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడు కంపెనీల ద్వారా జిల్లాలో డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే క్లియర్ వాటర్ కంపెనీ 430 చదరపు కిలోమీటర్లు, సర్వే ఆఫ్ ఇండియా 600 చదరపు కిలోమీటర్లు, అస్లీనా కంపెనీ 532 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్ సర్వే నిర్వహించాయని వివరించారు. గ్రామాల్లో జరుగుతున్న ఓఆర్ఐ షీట్ల అనంతరం కార్యక్రమాలను నిరంతరం సర్వేయర్లు పరిశీలించాలన్నారు. వాటిని డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్లు సమీక్షిస్తూ ఏరోజు కారోజు వివరాలను కంట్రోల్రూమ్కు అందజేయాలన్నారు. నిర్దిష్ట ప్రణాళిక మేర డ్రోన్ల సంఖ్య పెరిగే కొద్దీ సర్వే చేయాల్సిన దూరాన్ని కూడా కచ్చితంగా నమోదు చేయాలని జేసీ వెంకటేశ్వర్ సూచించారు. ఇప్పటివరకు 103 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేశాఖ ఏడీ గిరిధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లత, డ్రోన్ సర్వే ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.