కరోనాను చంపేందుకు ఓ గది.. అభివృద్ధి చేసిన డీఆర్డీవో
ABN , First Publish Date - 2020-04-08T03:19:11+05:30 IST
కరోనాను హతమార్చేందుకు డీఆర్డీవో(డిఫెన్స్ రీసెర్చ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్) ఓ ఛాంబర్ను తయారుచేసింది. దీని ద్వారా కోవిడ్-19 కారణమయ్యే కరోనా వైరస్ను అంతమొందించవచ్చని...
న్యూఢిల్లీ: కరోనాను హతమార్చేందుకు డీఆర్డీవో(డిఫెన్స్ రీసెర్చ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్) ఓ ఛాంబర్ను తయారుచేసింది. దీని ద్వారా కోవిడ్-19కు కారణమయ్యే కరోనా వైరస్ను అంతమొందించవచ్చని డీఆర్డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డీకంటామినేషన్ చాంబర్ లేదా పర్సనల్ శానిటైజేషన్ ఎన్క్లోజర్(పీఎస్ఈ)గా పిలుచుకునే ఈ గదిలో శానిటైజర్, సబ్బులతో కలిసిన మిశ్రమం ఉంటుందని, ఓ వ్యక్తి శరీరంపై ఏ మాత్రం వైరస్, బ్యాక్టీరియాలు ఉన్నా ఈ మిశ్రమంతో అవి మరణిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఒకసారికి ఒకే వ్యక్తి ప్రవేశించవచ్చని, ఆ వ్యక్తి గదిలోకి ప్రవేశించగానే చాంబర్లో ఉన్న పరికరాలు మందును పిచికారీ చేస్తాయని, ఈ మందు ఆ వ్యక్తి శరీరంపై ఉన్న ప్రమాదకరమైన క్రిములన్నింటినీ చంపేస్తుందని వివరించారు. ఈ చాంబర్ను ఆస్పత్రులు, ఆఫీసులు వంటి సముదాయాల ప్రవేశ ద్వారాల వద్ద ఉంచినట్లయితే వచ్చే వారందరూ అందులోనుంచి వస్తారని, అలా వచ్చిన వారందరూ పూర్తిగా వైరస్ల బారి నుంచి రక్షణ పొందినట్లేనని డీఆర్డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ చాంబర్ను ఢిల్లీలోని ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు తరలించారు. ఇప్పటినుంచి ఈ చాంబర్ ఇక్కడ సేవలందిస్తుందని, మరికొద్ది రోజుల్లో అవసరం ఉన్న ప్రతి చోట ఈ చాంబర్లను ఉంచేలా ప్రయత్నిస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.