ఆరోగ్య హక్కుపై ప్రైవేట్ వర్సిటీ రూపొందించిన బిల్లు ముసాయిదా సిద్ధం

ABN , First Publish Date - 2021-10-17T16:59:30+05:30 IST

ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం రూపొందించిన ఆరోగ్యం,

ఆరోగ్య హక్కుపై ప్రైవేట్ వర్సిటీ రూపొందించిన బిల్లు ముసాయిదా సిద్ధం

న్యూఢిల్లీ : ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం రూపొందించిన ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ హక్కు బిల్లు, 2021 ముసాయిదా సిద్ధమైంది. ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రతి హెల్త్‌కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోనూ ఉచితంగా లేదా సరసమైన ధరలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొంది. 


ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ హక్కు బిల్లు, 2021 రూపకల్పన బాధ్యతను ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయానికి ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి అప్పగించింది. ఉచిత లేదా అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కు అని ఈ బిల్లు పేర్కొంది. ఈ బిల్లును బహిరంగ సంప్రదింపులకు అందుబాటులో ఉంచలేదు. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే దీనిని పంపించి, అభిప్రాయాలను తెలిపాలని కోరారు. 


ఏ వ్యక్తినైనా నిశిత పరిశీలనలో పెట్టాలన్నా, నిఘా పెట్టాలన్నా ముందుగా ఆ వ్యక్తికి మొత్తం సమాచారాన్ని తెలియజేసి, ఆ వ్యక్తి నుంచి స్పష్టమైన, స్వయంప్రతిపత్తిగల సమ్మతిని పొందాలని ఈ బిల్లు పేర్కొంది. ఇటువంటి సమ్మతి పొందకుండా ఏ వ్యక్తిపైనా నిఘా పెట్టరాదని పేర్కొంది. ట్రాన్స్‌జెండర్లు వంటివారిపై వారి సెక్స్ ఆధారంగా ఎటువంటి వివక్ష చూపరాదని తెలిపింది. 


ఈ బిల్లుకు ఆమోదం లభించి, చట్టంగా అమలైన ఆరు నెలల్లోగా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆరోగ్య మండళ్ళను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రజలను భాగస్వాములను చేయడానికి ఈ మండళ్ళు ఉపయోగపడతాయని తెలిపింది. 


ఇదిలావుండగా, ఈ బిల్లును ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాకుండా ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం రూపొందిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో పాటిస్తున్న గోప్యత అనేక నిబంధనలకు వ్యతిరేకమని చెప్తున్నారు. 


Updated Date - 2021-10-17T16:59:30+05:30 IST