‘తమిళనాడులో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు!’
ABN , First Publish Date - 2021-03-07T16:58:54+05:30 IST
బీజేపీకి ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లు కూడా రావని...
చెన్నై/పెరంబూర్ : అన్నాడీఎంకే కూటమిలో పోటీచేయనున్న బీజేపీకి ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లు కూడా రావని, ఆ నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి విజయం తథ్యమని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్ అభిప్రాయపడ్డారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజావ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి అన్నాడీఎంకే అండగా నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ కూటమికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాలుమోపే అవకాశమే లేదని, ఆ పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాలు అన్నింటిలో డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. డీఎంకే కూటమిలో తమకు సీట్ల కేటాయింపుపై కొంత అసంతృప్తి వున్నా, మతవాదశక్తులను అడ్డుకోవడం, కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సర్దుబాటుకు అంగీకరించినట్టు తిరుమావళవన్ తెలిపారు.