Delhi Fire Accident : డజన్లకొద్దీ ఈ-రిక్షాలు అగ్నికి ఆహుతి
ABN , First Publish Date - 2022-06-08T19:34:35+05:30 IST
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జామియా నగర్లో బుధవారం ఉదయం
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జామియా నగర్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో డజన్లకొద్దీ ఈ-రిక్షాలు, ఇతర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఉదయం 5.02 గంటలకు ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అగ్నిమాపక శాఖ అందుకుంది. వెంటనే 11 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేసేందుకు కృషి చేశాయి.
జామియా నగర్లోని మెయిన్ టికోనా పార్ట్లోని పార్కింగ్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బుధవారం ఉదయం 5.02 గంటలకు సమాచారం అందిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. వెంటనే 11 అగ్నిమాపక శకటాలను పంపించినట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురాగలిగామని, ప్రాణహాని జరిగినట్లు సమాచారం లేదని చెప్పారు.
10 కార్లు, ఓ మోటార్ సైకిలు, రెండు స్కూటీలు, 30 కొత్త ఈ-రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయని, వీటిలో కొన్ని బూడిద కుప్పలుగా మారిపోయాయని చెప్పారు.
ఢిల్లీలో ఇటీవల ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. దీంతో అనేక అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముండ్కాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు.