భూసార పరీక్షలకు మంగళం

ABN , First Publish Date - 2020-07-02T11:22:28+05:30 IST

.భూసార పరీక్షలు అటకెక్కాయి. ఓవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి.. మరోవైపు నిధుల లేమితో ఈ ఏడాది భూసార పరీక్షలు నిలిపేశారు. ఫలితంగా

భూసార పరీక్షలకు మంగళం

సాగుపై సందేహం


(ఇచ్ఛాపురం రూరల్‌) : భూసార పరీక్షలు అటకెక్కాయి. ఓవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి.. మరోవైపు నిధుల లేమితో ఈ ఏడాది భూసార పరీక్షలు నిలిపేశారు. ఫలితంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 శాతం మంది ఆధారపడుతున్నారు. వరి పంట ఎక్కువగా సాగు చేస్తారు. రాగులు, వేరుశనగ, అపరాలు, చిరుధాన్యాలు తర్వాత స్థానాల్లో ఉంటాయి. మరోవైపు ఉద్యాన పంటలకూ జిల్లా పేరొందింది. వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో సారం తక్కువగా ఉంది. కొన్నిచోట్ల చౌడు నేలలు కూడా ఉన్నాయి. భూ సారం ఆధారంగా పంటలు సాగు చేస్తేనే అన్నదాతకు ఆదాయం సమకూరుతుంది. లేదంటే నష్టపోవాల్సిందే. ఈ ఏడాది భూసార పరీక్షలు నిలిచిపోవడంతో నేల సారం తెలుసుకోవడం కలగానే మిగిలిపోయిందని రైతులు వాపోతున్నారు.  


నష్టపోవాల్సిందేనా..? :

జిల్లాలో ఏటా మార్చి చివరికి పంటలన్నీ చేతికొచ్చేస్తాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రైతుల పొలాల నుంచి వ్యవసాయాధికారులు మట్టి నమూనాలు సేకరించి, ఆమదాలవలసలోని పరిశోధన కేంద్రానికి పంపుతారు. వాటిని పరీక్షించి భూమిలో సారం ఏ మేరకు ఉంది. సారం పెంచేందుకు ఎలాంటి ఎరువులు వాడాలి. ఏయే పంటలు సాగు చేయవచ్చనే వివరాలతో ప్రతి రైతుకు ప్రత్యేక కార్డులు ఇచ్చేవారు. ఈ ఏడాది ఆ ప్రక్రియ ఆగిపోయింది. భూసార పరీక్షల ఊసేలేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. భూసారం గురించి తెలియకపోవడంతో ఎలాంటి పంటలు వేయాలి. ఏఏ ఎరువులు వాడాలి అనే దానిపై అయోమయం చెందుతున్నారు. ఎరువుల విక్రయించే వారి మాటలనే నమ్మి.. సాగులో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


నమూనాలే సేకరించలేదు

కేంద్ర ప్రభుత్వ నిధులతో భూసార పరీక్ష కేంద్రాలు రైతులకు సేవలందిస్తున్నాయి. జిల్లాలో ఆమదాలవలస భూసార పరీక్ష కేంద్రం ద్వారా ఏటా కనీసం 40 వేల నమూనాలు సేకరించి పరీక్షించే వీలుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నిలిచిపోవడంతో నమూనాల పరీక్షలు అటకెక్కాయి. కనీసం సంచార ప్రయోగశాల వాహన నిర్వహణకు నిధులు లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క నమూనా కూడా అధికారులు పరీక్షించలేకపోయారు. ప్రస్తుతం ఈ సిబ్బంది రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. 


అవగాహన కల్పించేవారే లేరు 

నాకు మూడెకరాల భూమి ఉంది. ప్రతి సంవత్సరం అధికారులు నీరు, మట్టి నమూనాలు తీసుకుని పరీక్షించి వాటి పత్రాలు ఇచ్చేవారు. నేలలో సారం ఎంత ఉంది? ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది? ఎరువులు ఎంత శాతం వేయాలో చెప్పేవారు. ఈ ఏడాది నమూనాల సేకరణే లేదు. 


అనుమతి రాలేదు 

కేంద్రం నుంచి నిధులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణ తాత్కాలికంగా నిపివేశాం. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో పని చేస్తున్న వారికి శిక్షణ ఇస్తున్నాం. రోజూ కొందరు రైతులు స్వతహాగా నమూనాలు తీసుకువస్తున్నారు. వాటికి పరీక్షలు నిర్వహించి సలహాలు అందిస్తున్నాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని భూసార పరీక్షలు పునఃప్రారభమయ్యేలా చూడాలి. 

జి.సత్యవతి, ఏడీ, భూసార పరీక్ష కేంద్రం, ఆమదాలవలస.


Updated Date - 2020-07-02T11:22:28+05:30 IST